5 – సుధర్మా – చ్యవన సంవాదం

సూతమహర్షి తరువాత కథనిలా కొనసాగించాడు :

సూతుడు:

ఓ మహర్షులారా! తండ్రి ఆదేశము మీరలేని హేమక౦ఠుడు తన తల్లియైన సుధర్మను ప్రేమగా సమీపించి ఇలా అన్నాడు. “ఓ తల్లీ! నన్ను యిలా ఒంటరిని చేసి వెళ్ళటం మీకేమన్నా న్యాయమా? మీతోపాటూ నన్నూ అరణ్యాలకు వచ్చేలా తండ్రిగారికి చెప్పి నీవు దయతో ఒప్పించు! వారంగీకరిస్తే మీ ఉభయులకూ సేవచేస్తూ నాజీవితాన్ని సార్థకం చేసుకుంటాను. మీకు దూరమైనాక – ఇక ఈరాజ్యమన్నా, నాకు జీవితమన్నా – ఏమాత్రం కాంక్షలేదు!” అంటూ బ్రతిమాలాడు. అందుకు మహారాణియైన సుధర్మ తన కుమారుణ్ణి అనునయిస్తూ శిరస్సున ముద్దాడి ఇలా అంది.

సుధర్మ:

“నాయనా! తీవ్రమైన శారీరక అస్వస్థతకు గురైవున్న మీతండ్రి ఇందుకు ఏమాత్రం ఒప్పుకొనరు. పైగా అది ధర్మవిరుద్ధం కూడాను! నేను మాత్రం మీతండ్రిగారిని సుఖాలలో అనుసరించినట్లే, ఈ బాధలలో కూడా తోడుగావుంటాను. అదే నిజమైన పతివ్రతకు ఆచరణీయం! కనక నీవు యిక ఏమాత్రం ఆలస్యంచేయక, మీ తండ్రిగారి ఆదేశానుసారం మన నగరానికి ఈ పరివారంతోపాటు వెనక్కు మరలటం శ్రేయస్కరం!” అంటూ నచ్చచెప్పింది! సూతులవారు ఇలా చెప్పసాగారు. “ఓ ఋషులారా! ప్రేమపూర్వకమైన తల్లి అనునయ వాక్యాలనువిన్న హేమకంఠుడు ధర్మబుద్ధితో తన మాతాపితరులకు ప్రదక్షిణ నమస్కరాలుచేసి, తన పరివారంతో తన రాజ్యానికి వెనుతిరిగాడు! తిరిగి తన రాజభవనంలో ప్రవేశించి దుఃఖంతోనూ, సంతోషంతోనూ, సమ్మిళితమైన అంతరంగంతో తన ప్రజానీకాన్ని పుత్రప్రేమతో తండ్రి భోధి౦చిన రీతిలోనే ఎంతో ధర్మబధ్ధ౦గా, రాజ్యపాలనను చేయసాగాడు.

సోమకాంత మహారాజు అరణ్యానికి వెళ్ళడం

ఆతరువాత జరిగిన కథావిధానం గురించి ఋషులు ప్రశ్నించగా సూతమహర్షి ఇలా చెప్పాడు.

సూతుడు:

“ఓమహా ఋషులారా! అనంతరం సోమకాంతమహారాజు అరణ్యానికి ఎలావెళ్ళిందీ, అక్కడ ఏమేం చేసిందీ అంతా వివరంగా చెబుతాను సావధానచిత్తులై వినండి!”

“సుబల, జ్ఞానగమ్యులనే మంత్రులిద్దరూ తనకు ముందు నడవగా, భార్య సుధర్మ తనను నీడయై అనుసరించగా, రాజు ఘోరారణ్యంలో ప్రవేశించాడు. వారందరూ వానప్రస్థధర్మములైన ఒంటిపూట భోజనం, నేలపైన శయనించుటవంటి నియమాలను పాటిస్తూ, మార్గమధ్యంలో కలిగే ప్రయాణపు బడలికచేత, ఆకలిధప్పులచేత బాధలను అనుభవిస్తూకూడా, సుఖఃదుఃఖాలను సమదృష్టితో చూసే యోగులవలే, మార్గాయాసాన్ని, తొలగించుకుంటూ దీక్షగా తమ ప్రయాణం కొనసాగించారు. ఇలా చాలా అరణ్యాలను దాటుకుంటూ వెళ్ళి ఒక సుందరమైన ప్రదేశంలో తామరపుష్పాలతో నిండిన సరోవరాన్ని చూశారు. అనేక జలపక్షులతోనూ, జలకాలాడే ఏనుగుల సమూహాలతోనూ, తామర పుష్పాలతోనూ నిండిన ఆ సరస్సు ఎంతో అందంగా కనిపించింది. అనేక వృక్షాలతో, దట్టమైన తీగలతో చుట్టుకుని ఉండి చూడటానికి ఆహ్లాదం కలిగించేదిగా ఉన్నాయి! అక్కడి చల్లని సుగంధ వాయువులు ఆ సరస్సుమీదనుంచి వీచి ఆ ప్రశాంత పరిసరాలు మనస్సుకు ఒక అనిర్వచనీయమైన ప్రశాంతతను కలిగిస్తున్నాయి. ఆ సరస్సులోనుండే తమ స్నానపానాలకు అనుష్టానాలకు అవసరమైన నీటిని అక్కడి మునులు, తమ పూజలకై ఫలపుష్పాలనూ కూడా తీసుకేడుతుంటారు. అక్కడ రకరకాల పక్షులు తమ కిలకిలారావాలతో అదో దివ్యలోకమా లేక స్వర్గంలోని నందనోద్యానమా అనిపించేలా ఉన్నది. ఆ చల్లని గాలి సోకగానే శరీరానికి బడలిక తీరి ‘వేరేలోకాల అంచుల్లోకి తీసుకెళుతున్నదా?’ అన్నంత విశ్రాంతి కలిగించేలా వున్నది.

“ఓ ఋషివర్యులారా! అలాంటి సుందరమైన మనోజ్ఞమైన సరోవరసమీపం లోకి చేరిన రాజు తన మంత్రులతోనూ భార్యతోకూడా కలిసి విడిదిచేసి అక్కడ తన స్నానసంధ్యాదికములను నిర్వర్తించుకొని సమీపంలో లభించిన కందమూలాలను భక్షించి ఆనాటికి విశ్రాంతి తీసుకొనసాగాడు. ప్రయాణపు బడలికతో రాజుకు అక్కడి ఇసుకతిన్నేపైననే కంటికి మంచినిద్ర పట్టింది! భార్య సుధర్మ భర్తయొక్క అలసట తీరేలా పాదములు వత్తసాగింది. మంత్రులిద్దరూ ఆమె ఆదేశంమేరకు కందమూలాలు సేకరించడానికి అరణ్యంలోకి వెళ్ళారు. ఇంతలో అక్కడికి వచ్చిన అద్భుతమైన ముఖవర్చస్సుతో బ్రహ్మతేజస్సుతో కుమారస్వామియా అనిపించేలా వెలిగిపోతున్న ఒక ఋషికుమారుడిని సుధర్మ చూచింది. తనలోతాను ఇలా అనుకున్నది.

“ఆహా! ఈ మునికుమారుని వలన నా మనస్సులోగల అభీష్టములు తప్పక నేరవేరగలనిపుస్తున్నది!” నెమ్మదిగా అతన్ని సమీపించి యిలా ప్రశ్నించింది.

సుధర్మ:

“ఓ ఋషికుమారా! నీవెవరవు? ఇక్కడికి ఎక్కడినించి వస్తున్నావు? నీ తల్లిదండ్రులెవరు? దానికా ఋషికుమారుడిలా బదులిచ్చాడు.

సుధర్మా ఋషికుమారుల సంవాదము

చ్యవనుడు:

“ఓ తల్లీ! నేను భ్రుగుపుత్రుడను. నాతల్లి పులోమ! నీటికోసం ఈ తటాకం వద్దకు వచ్చాను. నాపేరు చ్యవనుడు! ఓతల్లీ! నీవెవరవు? ఈ ఘోరమైన అరణ్యములోకి ఎక్కడినుండి వచ్చారు మీరు? నీవు సేవిస్తున్న ఈతడెవరు?ఈతని శరీరం ఇలా వర్షాకాలపు మేఘంలా స్రవించడానికి కారణమేమిటి? ఏ పాపకర్మచేత ఇతని శరీరం యిలా దుర్గంధ భూయిష్టమైనది? ఇలా క్రిమికీటకాదులచే పీడింపబడే శరీరంతో వున్న ఇతడిని నీవు సేవించడానికి కారణమేమిటి? నీవా అతిసుకుమారివి! అపురూపమైన సౌందర్యం నీ సొత్తులా కనిపిస్తున్నది! ఇటువంటి రోగిష్టివాడినెలా వరించావు? నీ తల్లిదండ్రులూ, స్నేహితులూ ఇతడిలాంటి వాడని తెలియక మోసగించబడ్డారా?” అంటూ ప్రశ్నించాడు.

అప్పుడు రాణీ, మహాపతివ్రతాయైన సుధర్మ యిలా బదులిచ్చింది.

సుధర్మ:

“ఓ ఋషికుమారా! సౌరాష్ట్రదేశంలో దేవనగరమనే పట్టణానికి రాజైన ఈతడు నాభర్త! సోమకాంతుడితని పేరు. సకల సద్గునశోభితుడై, పరాక్రమోపేతుడై ఐశ్వర్యవంతుడై, బలసౌందర్యోపేతుడైనవాడీతడు. నీతిశాస్త్రవిశారదుడు. ప్రజారంజకంగా చిరకాలం రాజ్యపాలన చేసినవాడు. అనేక రాజ్యభోగాలను నిరాటంకంగా అనుభవించాడు. పురాకృత కర్మవశాన ఈతడికి భరింపరానంతటి ఈ దురవస్థ సంప్రాప్తమైంది. అందువల్ల తన రాజ్యభారాన్ని కుమారుడైన హెమక౦ఠుడి భుజస్కందాలపై ఉంచి, ఇద్దరు మంత్రులైన సుబల, జ్ఞానగమ్యులతో ఈ ఘోరారణ్యంలోకి నాతోపాటు ప్రవేశించాడు! మంత్రులిరువురూ కందమూలలను సేకరించటానికి వెళ్ళారు. నాయనా, ఈ అరణ్యం అనేక కౄరజంతువులతో కూడినదికదా! రాక్షసులు భూత ప్రేతపిశాచాలుకూడా సంచరించే ప్రాంతమిది. అయినా ఇక్కడ ఎవ్వరూ మాకెట్టి హానీ తలపెట్టడంలేదెందుకనో? మాకింకా దుఃఖానుభవము మిగిలివున్నందు ఊరకున్నారేమో? మా ఈ దుఃఖానికి అంతే కనబడటంలేదే! షడ్రసోపేతమైన రాజోచిత భోజనాలెక్కడ?దొరికినంతటితో సరిపుచ్చుకోవాల్సిన ఈ కందమూల భక్షణమేక్కడ? ఐనా ఈ కందమూలాలే ప్రస్తుతం అత్యంత రుచికరములుగా ఉన్నయిమాకు! దరిద్రులూ, తాపసులూ తినే ఇటువంటి ఆహారం శ్రీమంతులకు జీర్ణమవటం కష్టమేకదా! హంసతూలికా తల్పంమీద పరిచారగణంయొక్క సేవలందుకుంటూ నిద్రించే ఈ ప్రభువు ఈనాడు ఇలా కటికనేలలపైన ఎగుడుదిగుళ్ళుగా వుండే యిసుకతిన్నేలపైన సేదతీరుతున్నాడు. చందనం, పునుగు జవ్వాది మొదలైన సుగంధద్రవ్యాలచేత పరిమళించే ఈ మహారాజు శరీరం ఇప్పుడు దుర్గంధపూరితములైన చీము, రసి ఓడుతూ దుర్భరంగా ఉన్నది. ఎప్పుడూ పండితగోష్టితో కాలంగడిపే రాజు ఇప్పుడు దుఃఖసాగర నిమగ్నుడై ఉన్నాడు. ఓ భృగునందనా! ఈ దుర్భరమైన దుఃఖసాగరాన్ని ఎట్లా దాటగలము? అగాధమై అంతూ దరీ తెలీని ఈ దుఃఖసముద్రాన్ని దాటటానికి నీవు మాకు తెప్పలాగా సహకరించి మమ్మల్ని ఈ స్థితినుంచి రక్షించు!” అంటూ రాణి చ్యవనుడితో గద్గదకంఠియై ప్రార్థించింది!

Chapter 5 complete