1 – భృగు సోమకాంత సంవాదం

వేదవ్యాసకృత గణపతి ప్రార్థన

“శబ్దబ్రహ్మయై – వాక్కులకు ఛ౦దోగణాలకూ అధిపతి – ‘గణపతి’ స్వరూపియైన ‘బ్రహ్మనస్పతి’కి భక్తిపూర్వక నమస్కారము! సమస్త కార్యములకూ విఘ్నభయం నివారించే “విఘ్నపతి”కి నమస్కారము. మాకు సమస్త సంపదలనూ ఇచ్చే “లక్ష్మిగణపతి”కి, లక్షని కటాక్షించే మహా గజమునకు నమస్సులు!     ‘సిద్ధి’-ని కలిగించే యోగ జ్ఞానస్వరూపమైన ‘బుద్ధీ’శునకు నమస్సులు. సమస్త దేవతాగణములకూ ప్రథముడైనవాడూ – ‘అక్షర’, భీజాక్షర, మంత్రరూపదేవతా గణాలకు ప్రథమ ఆరాధ్యుడైన ‘ఓంకార’ స్వరూపియైన “గణనాథున”కు నమస్సులు!”

“ఓ బ్రహ్మరూపీ! జ్ఞానప్రదుడవు! ఓ విష్ణురూపీ సంపత్ర్పదుడవు! ఓ రుద్రరూపీ ‘కర్మ’లను భస్మంచేసే వైరాగ్య స్వరూపుడవు! నీవే పరబ్రహ్మవు! సమస్త వేదరాశికీ అక్షరరూపియైన ఓ ఛ౦దస్వరుడా! నీకివే నా నమోవాకములు! ప్రసన్నుడవుకమ్ము!”

ప్రారంభం

బ్రహ్మవిద్యాప్రదాయకుడైనటువంటి గణేశునకు నమస్కారము. విఘ్నములనే సాగరములను అగస్త్య ఋషివలే శోశింపచేయు గణపతికి మనసా నమస్కరించుచున్నాను.

పూర్వం నైమిశారణ్యంలో శౌనకాది మహర్షులు లోకకళ్యాణార్థం పన్నెండు సంవత్సరాలపాటు జరిగే సత్రయాగాన్ని తలపెట్టారు. అందులో భాగంగా ప్రతిరోజూ సాయంసమయంలో సత్కధాశ్రవణం చేసేవారు! ఒకనాడు సత్కాలక్షేపం చేసే సంకల్పంతో ఆ యజ్ఞస్థలానికి విచ్చేసిన సూతమహమునితో ఇలా అన్నారు.

“ఓ సూతమహాముని! నీవు సకల శాస్త్రాల పురాణాల సారం ఎరిగినవాడవు! సకల విద్యలకూ నిధివైన నీవంటి వక్త లభించటం జన్మజన్మంతరములలో చేసిన మహాపుణ్యం వలనగానీ జరగదు! మేమంతా అటువంటి నీ దర్శనమాత్రం చేత ధన్యులమైనాము! మా మనస్సులను పవనమోనరించే భాగవత్కథలను నీనుండి వినాలన్న ఉత్సాహంతో ఉన్నాము. కనుక అట్టి పరమ కమనీయములూ, పవనకరములూ మంగళమయములైన భాగవత్కథలను మాకు శ్రవణానందముగా వినిపించి మమ్మల్ని కృతార్థులను చేయవలసింది!”

అమోఘ తపస్సంపన్నులూ, నిగ్రహానుగ్రహ సమర్థులు అయిన ఆ ఋషుల ప్రశ్నను విన్న సూతుడిలా బదులిచ్చాడు.

సూతుడు:

“ఓ పరమపావనులైన మునిసత్తములారా! పావనమైన మీయొక్క ప్రశ్న సకల లోకాలకూ ఉపకరించేదీ, నన్నూ తరింపచేసేదీను! కనుక మీరు కోరినవిధ౦గా సత్కధా కాలక్షేపం చేయాలని నాకూ ఉత్సాహంగానే ఉన్నది!

“ఓ పావనులారా! మద్గురువరేణ్యులైన వ్యాసమునీంద్రుల వారిచే రచింపబడిన అష్టాదశ పురాణాలనూ, అష్టాదశ ఉపపురాణాలను కూడా మా గురుదేవుల అనుగ్రహంతో ఆసాంతం నేర్చుకున్నాను. వీటిలో ముఖ్యమైన ఉపపురాణంగా చెప్పతగిన శ్రీగణేశపురాణాన్ని మీకు వినిపిస్తాను. ఈ పురాణంయొక్క విశేషమేమిటంటే ఇది అంతతేలికగా లభించేదికాదు! ఈ గాణేశుడిని స్మరణమాత్రంచేతనే విఘ్నములనే మంచుతెరలు ఆయన అనుగ్రహమనే సూర్యోదయంతో పటాపంచలైపోతాయి. విఘ్నపతి‍ భక్తులకు తమ మనోభీష్టసిద్ధీ, సకలకార్యసిద్ధీ కలుగుతుంది.

ఎన్నో జన్మజన్మాంతరాల పుణ్యంవల్లనే ఇటువంటి కధాప్రసంగం వినడం, చెప్పడం లభిస్తుంది. ఐతే నాస్తికులైనవారూ, శ్రద్ధారహితులూ ఎంతమాత్రం ఈ పురాణశ్రవణానికి అర్హులుకారు! ఈ గజాననుడు భక్తవత్సలుడు! అనంత మహిమోపేతుడు! నిత్యసత్య స్వరూపుడు. ఈయన నిర్గుణతత్వ్తంగానూ, సగుణమూర్తిగాకూడా ఆరాధించబడుతున్నాడు. సకల వేదాలకూ, మంత్రాలకూ ఆదిలో వెలువడిన ప్రణవస్వరూపుడే గజాననుడు.

ఈ వినాయకుని అట్టి ప్రణవస్వరూపునిగానే ఇంద్రాది సకల దేవతలూ తమ హృదయాలలో నిరంతరం ధ్యానిస్తూ ఉంటారు. ఈతడే అఖిల జగములకూ కారణమైనటువంటివాడు. ఆదిమధ్యాంతరహితుడు. త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు తమతమ కార్యభారాన్ని (సృష్టి స్థితి లయలను) ఈ గణేశుని అనుజ్ఞమేరకే నిర్వర్తిస్తున్నారు. ఈయన ఆజ్ఞవల్లనే వాయువు వీస్తున్నాడు, అగ్ని ప్రజ్వరిల్లుతున్నాడు, జలములూ ప్రవహిస్తున్నాయి! అట్టి సర్వేశ్వరుడు సకల జగన్నియామకుడైన గణేశుని చరిత్రను మీకు తెలియచేస్తాను. ఎంతో రహస్యమైనటువంటిదీ, అమోఘమైనట్టి ఈ పావనచరితాన్నిభక్తిశ్రద్ధలతో ఆలకించండి!

ఈ గణేశపురాణాన్ని ముందుగా బ్రహ్మ వ్యాసమహర్షికి ఉపదేశించాడు. ఆయన భ్రుగువుకూ, ఆ భ్రుగుమహర్షి తరువాతికాలంలో సోమకాంతమహారాజుకు ఉపదేశించారు.

ఈ పురాణాన్ని భ్రుగుమహర్షికీ సోమకాంత మహారాజుకు మధ్య జరిగిన సంవాదంగా తెలియజేస్తాను. సావధనమనస్కులై ఆలకించండి!

కథా ప్రారంభము

సూతుడు:

పూర్వం సౌరాష్ట్రదేశంలో దేవనగరమనే రాజ్యం ఉండేది! ఈ రాజ్యాన్ని సోమకాంతుడనే మహారాజు పరిపాలించేవాడు. ఎంతో పరాక్రమవంతుడై, జనరంజకంగానూ, ధర్మబద్ధ౦గానూ ప్రజలను కన్నబిడ్డలవలే ప్రేమగా పాలించేవాడు. సౌందర్యంలో మన్మధుడిని తలదన్నేలా – సార్ధక నామదేయుడిగా (చంద్రుని వెన్నెలవంటి శరీరకాంతి కలిగి) ప్రకాశించేవాడు. ధర్మబద్ధంగా పరిపాలన చేయడంవల్ల అతడి రాజ్యం సుభిక్షంగా, సస్యశ్యామలమై, ధనదాన్యాలతోనూ పాడిపంటలతోనూ అలరారుతూ, శత్రువులకు కన్నెత్తి చూడరానిదై ఉండేది!

ఈరాజుగారి కొలువులో నీతికోవిదులు, సకల శాస్త్రపారంగతులూ, ప్రభుభక్తి పరాయణులూ ఐన ఐదుగురు మంత్రులు౦డేవారు. వారు రాజుకు సరైన సలహాలనిస్తూ, వ్యూహరచనచేస్తూ సమర్థవంతంగా పరిపాలన నిర్వహిస్తూండేవారు! సోమకాంతుడు తన భుజపరాక్రమం చేత అనేక దేశాల రాజులను సామంతులను చేసుకుని వారినుంచి కప్పము తీసుకునేవాడు. ఆమంత్రులు వరుసగా 1) రూపవంతుడు, 2) విద్యాధీశుడు, 3) క్షేమంకరుడు, 4) జ్ఞానగమ్యుడు, 5) సుబలుడు అన్నపేర్లతో పిలువబడేవారు.

ఆరాజుకు సుధర్మ అనే భార్య ఉండేది. అమిత సౌందర్యవతి, సకలసద్గుణ సంపన్నయైన ఆ మహాపతివ్రత రాజుకు తలలో నాల్కలాగా అతడు చేసే దేవతాది పూజలలో తోడ్పడుతూ సర్వఅలంకారములతోనూ శోభిల్లుతూ మంగళస్వరూపిణిగా ఉండేది.

ఆ పుణ్యదంపతులకు అమిత బలపరాక్రమోపేతుడూ, గుణవంతుడూ బుద్ధిశాలియైన హెమక౦ఠుడనే కుమారుడుండేవాడు. ఇలా సకల సిరిసంపదలతో, కీర్తిప్రతిష్టలతో ప్రకాశించే సోమకాంత మహారాజు లోకకళ్యాణార్థం ఎన్నో యజ్ఞయాగాదులు నిర్వహిస్తూ, దాతయై తన రాజ్యాన్ని నిష్కంటకంగా పరిపాలించేవాడు.

Chapter 1 Complete